హయత్ నగర్ మండలంలో వాల్టా చట్టం వర్తించదా..?
నమిశ్రీ బిల్డర్స్ అక్రమాలకు అడ్డు అదుపు లేదా..!
గడువు ముగిసిన ఆగని సెల్లార్ తవ్వకాలు
మామూళ్ల మత్తులో జోగుతున్న మైనింగ్, రెవెన్యూ అధికారులు
అక్రమ మట్టి తరలింపును ప్రోత్సహిస్తున్నది ఎవరు..?
తెరవెనుక చక్రం తిప్పుతున్నది స్థానిక ఎమ్మెల్యే నా..?
అందుకే.. తహశీల్దార్ అక్రమార్కులకు వత్తాసు పలుకుతుందా..!
చర్యలు తీసుకోకపోవడం మామూళ్ల మత్తులోన.. లేక ఎమ్మెల్యే వత్తిడి నా..?
అనేక అనుమానాలు..!
మన తొలివెలుగు | రంగారెడ్డి :

హయత్నగర్ మండల పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపులు యదేచ్చగా జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. వాల్టా చట్ట నిబంధనలు అమలు చేస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికంగా నమిశ్రీ బిల్డర్స్కు సంబంధించిన నిర్మాణ పనుల్లో గడువు ముగిసినప్పటికీ సెల్లార్ తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తవ్వకాల నుంచి వెలువడుతున్న మట్టిని అనుమతులు లేకుండా తరలిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాల్సిన తహశీల్దార్ పై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

చర్యలు తీసుకోకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లా.. ఇతర కారణాలా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉందా? అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల వివరణ వెలువడాల్సి ఉంది. మరోవైపు మట్టి తరలింపుపై రెవెన్యూ, మైనింగ్ శాఖలు సమగ్రంగా విచారణ జరిపి, అనుమతులు, పర్మిట్లు, తవ్వకాల గడువు తదితర అంశాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.